కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నిర్మల్ జిల్లాలోని ప్రముఖ జ్ఞానసరస్వతి క్షేత్రం బాసర దేవాలయాన్ని (Basara Temple) సీఎం దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా పిప్రికి సీఎం చేరుకోనున్నారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మధ్యాహ్నం పిప్రిలో బహిరంగసభకు హాజరుకానున్నారు. అక్కడి సభలో ప్రసంగించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు 3ఏళ్లు పూర్తైన సందర్భంగా సభ నిర్వహించనున్నారు. పిప్రి బహిరంగసభలో పలువురు లబ్దిదారులకు సీఎం పత్రాలు పంపిణీ చేయనున్నారు.
ఇటీవలే బాసర ఆలయ (Basara Temple) అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4న ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ పై సీఎంతో అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్పై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని సూచించారు.

