కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ (Gaddam Indu Priya) ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబాను(Alka Lamba) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, మహిళలను పార్టీ కార్యక్రమాలలో చురుకుగా భాగస్వాములను చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడం వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

