కలం, మెదక్ బ్యూరో : నేడు గజ్వేల్ నియోజకవర్గం బంద్ (Gajwel Bandh) కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే క్రమంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాంగ్రెస్ నేతలే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారని BRS నేతల ఆరోపిస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ ఈ రోజు (సోమవారం) గజ్వేల్ బంద్ కి బిఆర్ఎస్ పిలుపునిచ్చింది. బిఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షా రెడ్డి సహా 42 మందిపై కేసు నమోదు చేశారు గజ్వేల్ పోలీసులు. దీంతో గజ్వెల్ లో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.
బంద్ లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు గజ్వెల్ ఆర్టీసీ డిపో ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు నేడు మెదక్ పట్టణంలో కూడా బంద్ కొనసాగుతోంది. మెదక్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారతీయ జనతా యువ మార్చ్ (BJYM) బంద్ కి పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

