కలం, వెబ్ డెస్క్: ఇండోనేషియాతో భారత్కు ప్రత్యేక బంధం కొనసాగుతోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. జకార్తాలోని ఆ దేశ పార్లమెంట్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇరు దేశాలను కేవలం సముద్రం మాత్రమే కలపడం లేదని.. రామాయణ, మహాభారత వంటి పురణాల కాలం నుంచి సంబంధాలున్నాయని చెప్పారు..
చారిత్రక, కళల అంశాల్లో ఇండియా, ఇండోనేషియాల మధ్య అనేక సారూప్యతలున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. ఇండోనేషియా స్వాతంత్య్ర పోరాటానికి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ గట్టి మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.
అభివృద్ధి మీదనే శ్రద్ధ..
భారత్ ఎప్పుడు అభివృద్ధి మీదనే శ్రద్ధ పెడుతుందని, విస్తరణవాద కాంక్ష ఎప్పుడూ లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనేది తమ నినాదమన్నారు. ఇండియా, ఇండోనేషియాల రాజధాలను మధ్య దూరం వేల కిలోమీటర్లు అయినా, రెండు దేశాల మధ్య సముద్ర దూరం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే అన్నారు.
కొన్ని సార్లు సముద్రాలే దేశాలను మరింత దగ్గర చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు విభజన వాదాన్ని పక్కన పెట్టి, భవిష్యత్తు కోసం అభివృద్ధి వంతెన నిర్మించుకున్నాయని ప్రశంసించారు.
ఉగ్రవాదాన్ని సహించబోం..
భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. గతేడాది పహల్గాం దాడి జరిగినప్పుడు ఇండోనేషియా తమకు పూర్తి మద్దతు ప్రకటించిందని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదం అంతానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అలాగే, నిఘా సమాచారం మార్పిడి, సైబర్ నేరాలు, ఉగ్ర ముఠాలకు నిధుల నిలిపివేత వంటి అంశాల్లో ఇక ముందు కూడా సమష్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

