కలం, ఆదిలాబాద్ బ్యూరో : కుమురం భీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలోని కెరమెరి మండలం, కోఠారి (Kothari) గ్రామం, కోలాం గిరిజన గూడెంలో దశాబ్దాలుగా మారని జీవన పరిస్థితులు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి. గుడిసెలలో జీవనం సాగిస్తున్న గూడేం బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో కొత్త ఆశలు చిగురించాయి. వర్షంలో తడుస్తూ, ఎండలో కాలుతూ, చలికాలంలో వణుకుతూ జీవిస్తున్న గిరిజన కుటుంబాల కోసం ప్రభుత్వం 26 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కాగా, ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.
ఈ జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పండుగ నిర్వహించనున్న ప్రభుత్వం, మొదటి విడతలో పూర్తయిన ఇళ్లను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొని గిరిజనుల ఇళ్లను ప్రారంభించనున్నారు. ఇటీవల మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
సీఎం రాకతో తమ జీవితాలలో కొత్త వెలుగు వస్తుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, త్రాగునీరు, సాగునీరు సౌకర్యాలు కల్పించాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అలాగే విద్య, వైద్య సేవలు మెరుగుపరచాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం రాక సందర్భంగా గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం పలకడానికి గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. తమకు అండగా నిలుస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు.

