నల్లగొండలో ఫ్లెక్సీ కడుతూ యువకుడి మృతి

కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవరకొండ రోడ్డులోని గంగ వారి గూడెం వైపు వెళ్లే రహదారిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లెక్సీ కడుతున్న రాజు అనే యువకుడు విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే స్పందించి ఫ్లెక్సీని తొలగించడమే కాకుండా, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు మాజీ ఎమ్మెల్యే ఫ్లెక్సీని చించివేసి నిరసన వ్యక్తం చేశారు.

అధికారులు పట్టించుకోకపోవడంతోనే..

మున్సిపల్ (Nalgonda Municipal Corporation) అధికారుల పర్యవేక్షణ లోపంతో అనుమతులు లేకుండా, ప్రమాదకరమైన విద్యుత్ తీగల సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకుల పుట్టిన రోజులు, పార్టీ కార్యక్రమాల పేరుతో నెలల తరబడి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నా కమిషనర్, మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కారణంగా నిరుపేద కుటుంబానికి చెందిన రాజు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : ఎమ్మెల్యేల‌తో సీఎం రేవంత్ అత్య‌వ‌స‌ర‌ భేటీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>