Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్టలో అభివృద్ధి పనుల జోరు.. రూ.99.55 కోట్లతో సీఎం శంకుస్థాపన

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ పరిసరాలు మరింత శోభాయమానంగా మారనున్నాయి. క్షేత్ర పరిధిలో రూ.99.55 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) శనివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ముందుగా కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

అనంతరం ఆలయానికి సంబంధించిన ఇతర అనుబంధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ.43.79,కోట్లతో వేద పాఠశాలకు ,రూ.9.86 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి, రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణానికి, రూ.1.34 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి, రూ.43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో వేద పాఠశాల నిర్మాణం..

అభివృద్ధి పనులలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న వేద పాఠశాలను దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో, 1,40,000 చదరపు అడుగుల వైశాల్యంతో మూడు దశల్లో నిర్మించనున్నారు. తొలి దశలో భాగంగా వేద పాఠశాల ప్రధాన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పాఠశాల ద్వారా ఒకేసారి 500 మంది వేద విద్యార్థులు విద్యానభ్యసించే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకు అవసరమైన వసతి, నివాస భవనాలు, ఆధునిక డైనింగ్ హాల్‌ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. ఈ ప్రాంగణానికి పక్కనే ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు ప్రత్యేకంగా యజ్ఞశాల, యాగశాలలను కూడా నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుట్ట సుఖేందర్ రెడ్డి,రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి ,ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం ఎల్ ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి , దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ధార్మిక సలహాదారు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>