కలం, సినిమా : సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న బికినీ ఫోటోలపై హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఒక ఫోటోషూట్కు సంబంధించిన వీడియో క్లిప్స్, ఫోటోలను మార్ఫింగ్ చేసి తన పేరిట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు పూర్తిగా AI టెక్నాలజీతో సృష్టించబడిన నకిలీ చిత్రాలని రుక్మిణి స్పష్టం చేశారు. ఆ ఫోటోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ కంటెంట్ సృష్టించడం, వాటిని షేర్ చేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆమె మండిపడ్డారు. ఇది వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించే చర్య అని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నామని, నకిలీ ఫోటోలను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు రుక్మిణి వసంత్ వెల్లడించారు. సైబర్ క్రైమ్ అధికారులను కూడా సంప్రదించినట్లు తెలిపారు. నకిలీవని తెలిసినా ఆ ఫోటోలను ఇతరులకు షేర్ చేయవద్దని, అలాంటి కంటెంట్ను ప్రోత్సహించవద్దని అభిమానులు, నెటిజన్లను ఆమె కోరారు.

