మొంథా తుపాను(Cyclone Montha) ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టం, అక్కడి ప్రజల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) దృష్టి సారించారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. తుపాను నష్టాన్ని అంచనా త్వరితగతిన వేయాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు పలు సూచనలు చేశారు.
‘‘గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టాం. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్తో సహా అంతా కలిసి టీమ్గా పనిచేశాం. కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే… బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలం. తుఫాన్ వెలిసింది కాబట్టి… వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలి. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి. ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.. వారికేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలి’’ అని Chandrababu అన్నారు.
‘‘మొంథా తుఫాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేయాలి… కేంద్రానికి నివేదిక అందివ్వాలి. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు వెంటనే అందించాలి… నిర్వాసితులను ఆదుకోవాలి. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం. సచివాలయాలపై మైక్ అనౌన్స్మెంట్ సిస్టంను ఏర్పాటు చేసి కింది స్థాయి వరకూ ప్రభుత్వ ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాం… ఇదొక నూతన విధానం తీసుకొచ్చాం. తుఫాన్ను ఎవరూ నివారించలేరు… కానీ, ముందు జాగ్రత్తలతో నష్టాలను నివారించగలుగతాం. కలెక్టర్లు, అధికారులు కంట్రోల్ రూమ్ లో కూర్చుని రియల్ టైం సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది బాగా పని చేశారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారు’’ అని చెప్పారు.
Read Also: కాంగ్రెస్ ఈవెంట్లో బంగ్లాదేశ్ జాతీయ గీతం..

