కలం, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా తర్వాత ఇరాన్ ఎక్కువగా యూఏఈని(UAE) టార్గెట్ చేసుకుంది. ఎమిరేట్స్లోని ప్రధాన నగరాలైన దుబాయ్, అబుదాబిపై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గరు మరణించగా, 58 మంది గాయపడినట్లు యూఏఈ వెల్లడించింది. చనిపోయినవాళ్లు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ పౌరులుండగా, గాయపడినవాళ్లలో ఒకరు భారత్కు చెందిన వ్యక్తి ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు యూఏఈ అధికారులు ఆదివారం సాయంత్రం తెలిపారు.
ఇరాన్ కేవలం అమెరికా ఎయిర్బేస్లనే కాదని, షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుంటోందని యూఏఈ ఆరోపించింది. బుర్జ్ ఖలీఫాపైన దాడికి ప్రయత్నించిందని, ప్రఖ్యాత పామ్ జుమేరా గేటెడ్ కమ్యూనిటీపై బాంబులు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 165 బాలిస్టిక్ మిస్సైల్స్ను తమ దేశంపైకి ప్రయోగించిందని, వాటిలో 152ను నాశనం చేశామని పేర్కొంది. అలాగే 541 డ్రోన్లు దాడికి రాగా, వాటిలో 506 కూల్చేశామని చెప్పింది. కాగా, యూఏఈలో(UAE) రాత్రంతా సైరన్ల మోత మోగింది. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

