కలం, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. సునీత న్యాయ పోరాటం కారణంగానే ఈ కేసు ఇంకా సజీవంగా ఉందన్నారు. తన తండ్రి హత్యకు కారణాలను తెలుసుకునే హక్కు సునీతకు ముమ్మాటికీ ఉందన్నారు. ఇప్పటి తరానికి గొడ్డలి హత్యా రాజకీయాలు తెలుస్తున్నాయని పరోక్షంగా వైసీపీని విమర్శించారు. ‘గొడ్డలి పార్టీ’ అని ప్రజల్లోకి బలంగా వెళ్తున్న కొద్దీ జగన్కు అసహనం పెరుగుతోందన్నారు. 30 ఏళ్ల కిందట ప్రచురితమైన ‘పాలెగాళ్ల రాజ్యం’ అనే పుస్తకాన్ని ఇప్పుడు అందరూ బయటకు తీసి చదువుకుంటున్నారని వివరించారు. వైఎస్ కుటుంబం ఇన్ని అరాచకాలు చేసిందా..? అని తానే ఆశ్చర్యపోతున్నట్లు పేర్కొన్నారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా.. తనకు ఈ విషయాలు తెలియవన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వారు, అలాంటి పార్టీ ఉండటం ప్రమాదకరమన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దేశమంతటా చర్చ..
మహిళలకు టీడీపీ ప్రకటించిన 33 శాతం రిజర్వేషన్ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే అన్నీ పార్టీలు ఇదే అంశాన్ని మాట్లాడక తప్పని పరిస్థితి రాబోతుంది. 2011 జనాభా లెక్కలు, తాజా జనాభా లెక్కల ప్రకారం చూసినా డీ లిమిటేషన్ చేస్తే మనకూ నష్టం జరిగేదన్నారు. అందుకే, 50 శాతం పెంచడంతో పెరిగిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని.. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

