కలం, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అయిపోలేదని, తాత్కాలికంగా కాల్పుల విరమణ మాత్రమే ప్రకటించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఆపరేషన్ సిందూర్ 2.0కి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తరువాత తరం యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు. పుణేలోని ఎన్డీఏ శిక్షణా కేంద్రంలో పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ హాజరై.. ప్రసంగించారు. సరిహద్దుల్లో భద్రతా బలగాలను రక్షించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజల భద్రతపై అదే స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు వివరించారు. దేశ ప్రజలు సమైక్యంగా ఉన్నప్పుడే, యుద్ధాల్లో విజయ శాతం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. సైన్యం, ప్రజలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉందన్నారు.
భవిష్యత్తు యుద్ధాల్లో చాలా మార్పులు..
భవిష్యత్తు యుద్ధాలు ఒకప్పటిలా ప్రాంతానికి పరిమితంగా ఉండబోవని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. భూమి, ఆకాశం, సముద్రం, సైబర్, ఎలక్ట్రానిక్ రూపాల్లో దాడులు జరగవచ్చన్నారు. ఆపరేషన్ సిందూర్.. దేశ సైన్య సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. పక్కా ప్లానింగ్, రియల్ టైం ఇంటెలిజెన్స్, బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టం కారణంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. సైన్య అవసరాలకు అనుగుణంగా, కొత్త బెటాలియన్లను కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.

