కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని రైతులకు వాతావరణ పరిస్థితులపై (Weather Updates) ముందస్తు సమాచారం అందించేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. విత్తనాలు నాటడం, ఎరువుల వినియోగం, సాగు పనులను సరైన సమయంలో ప్రణాళికాబద్ధంగా చేసుకునేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుంది.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు సచివాలయంలో తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతాంగానికి మేలు చేసేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ సమాచారాన్ని అన్నదాతలకు చేరవేసేందుకు DIL India, Evidence Action (Chicago) సంస్థలతో ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నారు. ఈ నూతన సాంకేతికత ద్వారా మొదటి విడతగా 17 జిల్లాల రైతులకు సేవలు అందనున్నాయి. వారి మొబైల్ ఫోన్లకు వాట్సప్ ద్వారా నేరుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా వారి మండలాల్లో వర్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే వివరాలను ముందస్తు మెసేజ్ల రూపంలో పంపిస్తారు. దీనివల్ల రైతులు అప్రమత్తమై పంట నష్టాలను నివారించుకునే అవకాశం కలుగుతుంది.

