కలం, నిర్మల్: మామడ మండలం పొన్కల్ గ్రామంలో ఇతర కులస్తులకు మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మున్నూరు కాపు కులస్తులు నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల తహసీల్దార్ ఎలాంటి విచారణ చేపట్టకుండానే పొన్కల్ గ్రామంలోని ఇతర కులస్తులకు మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో నిబంధనలను పాటించకుండా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన తహసీల్దార్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరారు.

