కలం, వెబ్ డెస్క్: దేశంలో ఎబోలా వైరస్ (Ebola Virus) కేసు ఒక్కటీ నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వైరస్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు అన్ని రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ పుణ్యసలీలా శ్రీవాస్తవ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆమె స్పష్టం చేశారు. WHO మార్గదర్శకాల ప్రకారం ఇండియాలో వ్యాధిపై నిరంతర పర్యవేక్షణ, ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అన్ని రాష్ట్రాల్లో నిరంతర అప్రమత్తత..
అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య సౌకర్యాలు, వైరస్ నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు, ఇతర పర్యవేక్షణ అంశాలను విధిగా చేస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు సమన్వయంతో ఉండాలని సూచించింది. 2014లో ఆఫ్రికాలో మొదటిసారి ఎబోలా బయటపడినప్పుడు.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇండియాకు గతానుభవం ఉందని కూడా స్పష్టం చేసింది. అప్పుడు తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడు కూడా అవసరమని అభిప్రాయపడింది.

