తెలంగాణలో హైవేల వెంబడి డేటా సెంటర్లు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని హైవేల వెంబడి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. హైదరాబాద్ అవతల నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా జీసీసీ పాలసీ సైతం రూపొందించాలని సూచించారు. ఐటీ, పరిశ్రమలు, ఫ్యూచర్ సిటీ, పెట్టుబడుల అంశాలపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కీలక సమీక్ష చేశారు.

అవసరమైతే ప్రధానితో మాట్లాడుతా..

రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు పర్యావరణహిత నెట్-జీరో విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన అయిదు ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేలా, అవసరమైతే ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత ఏఐ సిటీ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరిట ప్రత్యేక సొసైటీ..

రాష్ట్రంలో పెట్టుబడులను మరింత పెంచేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిలో ఐటీ, పరిశ్రమలు, ఇంధన, ఆర్థిక శాఖల సీనియర్ అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్‌లో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రాంగణాల్లో శంకుస్థాపనలకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.

అంతటా టి–ఫైబర్ నెట్ కనెక్షన్..

పరిశ్రమలు స్థాపించాలనుకునేవారి అవసరాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక ఎస్కార్ట్ ఆఫీసర్‌ను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మూడు నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఆపరేటర్లకు బదులుగా టి-ఫైబర్ (T-Fiber) ఇంటర్నెట్ కనెక్షన్‌ను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గత 6 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టి-ఫైబర్‌కు మారడం ద్వారా రూ. 54 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వివరించగా.. సీఎం అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>