కలం, నిజామాబాద్ బ్యూరో: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం (TUCI) ఆధ్వర్యంలో నిజామాబాద్ నెహ్రూ పార్క్ కార్మికుల అడ్డా వద్ద పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నా కార్మికులకు సంక్షేమ పథకాలు సమగ్రంగా అందడం లేదన్నారు. ఇన్సూరెన్స్ రెన్యువల్ ని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదన్నారు. నిర్మాణ రంగ కార్మికులు సహజ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు రూ.9000 పెన్షన్ ఇవ్వాలన్నారు.
పెళ్లి సమయంలో, పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చే రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎండాకాలం కార్మికులు అడ్డాల వద్ద నిలుచోవడానికి షెల్టర్లు, తాగునీరు, మూత్రశాలల సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అర్హులైన వాళ్లందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 25న హైదరాబాద్ లో లేబర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భవనిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు బి.లింగం, భవనిర్మాణ కార్మికులు సంతోష్, కరణ్, మహేష్, రవి, సాయన్న, గంగాధర్, సల్మాన్, ఫయాజ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

