కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించింది. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వం తరఫున జాతీయ రహదారులశాఖ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు. వరంగల్లో నిర్మితమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను దేశానికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.
అలాగే హైదరాబాద్-పనాజీ ఎకానమిక్ కారిడార్లో భాగమైన గుడెబల్లూర్-మహబూబ్నగర్ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక రైల్వే రంగానికి సంబంధించిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

