కలం, ఖమ్మం బ్యూరో: దేశ సాగు రంగం సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో, రైతాంగ పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్న ఇల్లందు (Yellandu) పట్టణం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ప్రథమ జాతీయ మహాసభలు మే 11, 12, 13 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఐయూక్స్ ఆల్ ఇండియా కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి పాల్గొని మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాసభల తొలి రోజైన మే 11 న సుమారు 10 వేల మంది రైతులు, కూలీలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో, భారీ మహా రైతు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించ నున్నామన్నారు. ఈ సభకు దేశంలోని 16 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నట్లు నాయకులు వెల్లడించారు.
ప్రధానంగా ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ అమలు, నల్ల చట్టాల రద్దు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన కనీస వసతులు కల్పించి, క్వింటాల్కు మద్దతు ధర చెల్లించాలానే అంశాల పై కీలక తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు. ఈ రైతు గర్జనను జయప్రదం చేయాలని, రైతాంగం, రైతు అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, సతీష్, వీరభద్రం, ఐయూక్స్ జిల్లా నేతలు బుర్రా వెంకన్న, అమర్లపూడి రాము, ధర్మా, జాతోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

