కలం, ఖమ్మం బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను చేతపట్టుకుని కొందరు బీఆర్ఎస్ నాయకులు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ వీరాభిమానులు మొటూరి మోహన్, అరిపల్లి వెంకటేష్ గౌడ్ (గోవింద్) సోమవారం ఈ వినూత్న మొక్కును తీర్చుకున్నారు. ఫొటోలను ప్రదర్శిస్తూ 14 కిలోమీటర్ల మేర అరుణాచల గిరి ప్రదక్షిణను కాలినడకన పూర్తి చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర ఘన విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అరుణాచలేశ్వరునికి ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు నాయకులు తెలిపారు.

