కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, సీఎం పవన్ కల్యాణ్ పర్యటన వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే పవన్ ఇక్కడ సభలు పెడతానటం ఏమిటని ప్రశ్నించారు.
పవన్ మాటలు హాస్యాస్పదం
తెలంగాణ వస్తే బాధపడి 11 రోజులు అన్నం తినలేదని చెప్పుకున్న పవన్ కల్యాణ్ తెలంగాణగడ్డ మీదకు వచ్చి పునర్నిర్మాణం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాజధాని, సెక్రటేరియట్ను కూడా కట్టుకోలేని వారు మన తెలంగాణకు వచ్చి పునర్నిర్మాణం చేస్తారా? అని ప్రశ్నించారు. డిక్షనరీ లో తెలంగాణ పదమే లేదన్న బక్కని నరసింహులు వాఖ్యలపై రేవంత్రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
కూటమిగా తెలంగాణ వ్యతిరేక శక్తులు
తెలంగాణ వ్యతిరేక శక్తులు కూటమిగా ఏర్పడి రేవంత్ రెడ్డిని ఏజెంట్గా వాడుకుంటూ తెలంగాణపై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారని వేముల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్ ఫంక్షన్హాల్లో జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ డిస్కమ్ పెద్ద కుంభకోణం
విద్యుత్ డిస్కమ్ను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్, గృహ అవసరాల సంబంధించి ఆదాయం వచ్చే డిస్కమ్ లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకం వేసిందని ఆరోపించారు. ఆదాయం లేని, బిల్లులు రాని రైతు వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి ‘రైతు డిస్కాం’గా మారుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, నియోజకవర్గ ఇంచార్జ్ రవీందర్ సింగ్, మాజీ మేయర్ నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సిర్ప రాజు, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, నవీద్ ఇక్బల్, పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

