కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) రిజిస్ట్రేషన్ కార్యాలయంలో (Registration Office) రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు వివిధ కారణాలు చూపుతూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని.. మాజీ కార్పొరేటర్ లింగంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. డాక్యుమెంట్ రైటర్ కిరణ్ అనే వ్యక్తి కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై పలుమార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వివిధ కారణాలతో ఆలస్యం అవుతున్న వారిని గుర్తించి, సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ నమ్మబలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చలాన్లకు అదనంగా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ ఫీజు పేరుతో సాధారణంగా వసూలు చేసే మొత్తాల కంటే అధికంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించిన లింగంపల్లి శ్రీనివాస్, సంబంధిత వ్యక్తిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ప్రజలు రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చినప్పుడు ఇబ్బందులు పడకుండా అధికారులు పారదర్శక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

