కలం, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గురువారం బీఆర్ఎస్ నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (Nomula Bhagath) స్థానిక రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నోముల భగత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న నెల్లికల్ లిఫ్ట్ పనులన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరై, ప్రారంభించబడినవని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆయన విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రారంభించిన ప్రాజెక్టులను మాత్రమే ఇప్పుడు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
రైతాంగానికి సాగునీరు సకాలంలో అందడం చాలా కీలకమని, అందుకే అధికారులు నెల్లికల్ లిఫ్ట్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నోముల భగత్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు తావుండకూడదని, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. నోముల భగత్ (Nomula Bhagath) వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

