కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ (Saikrishna) మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలని విజయవాడలోని రెండో అదనపు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కాల్ డేటాను కూడా భద్రపరచాలని కోర్ట్ ఆదేశించింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. మే 9వ తేదీన విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతడు కనిపించకుండా పోయాడు. సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేశాడని తల్లి ఆరోపించడం ప్రకంపనలు రేపుతోంది.
విచారణ జరుపుతున్న రాజమండ్రి ఎస్పీ..
కేసు విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు పోలీస్ అధికారులపై సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరపాలని డీజీపీని ఆదేశించడంతో రాజమండ్రి ఎస్పీని విచారణాధికారిగా నియమించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐని సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ నెల 29న సాయికృష్ణను తమ ముందు హాజరుపర్చాలని హైకోర్ట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

