కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిందని.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) వ్యాఖ్యానించారు. గురువారం ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నివాసానికి వచ్చిన దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న 19 విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయన్నారు.
అలాగే విశ్వవిద్యాలయాలకు తగిన నిధులు అందకపోవడం వల్ల పరిశోధన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఘోరంగా ఉన్నాయన్నారు. బడ్జెట్లో విద్యకు నిధులు కూడా అంతంత మాత్రమే కేటాయించడం దారుణం అన్నారు. 2026-27 బడ్జెట్లో విద్య రంగానికి కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయించడం తగదన్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసు ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో కనీసం 18 శాతం విద్యకు కేటాయించాలని సూచించిందని గుర్తు చేశారు.
ప్రాజెక్టుల పూడిక తీయాలి
జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవనాడి అని మాజీ గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గతంలో 2.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడిందని, ప్రాజెక్టు ప్రభావం ఆయకట్టు మార్పులు ఇతర కారణాలవల్ల ప్రస్తుతం ఆయకట్టు 2.35 లక్షల ఎకరాలకు తగ్గిందన్నారు. ప్రధానంగా పూడిక తొలగింపు, కాలువలు, ఆధునీకరణ నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అలాగే మోర్తాడ్ బాల్కొండ ఆర్మూర్ ప్రాంతాల రైతులు ఇప్పటికీ సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పెద్దవాగు వంటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నిర్మించి ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై అనేక హామీలు ఇచ్చిందన్నారు. కానీ రెండున్నరలు గడిచిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని దత్తాత్రేయ విమర్శించారు.
పసుపు రైతులతో సమావేశం
జిల్లా పసుపు రైతులతో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగిందన్నారు. ప్రధానంగా ఎగుమతులు పెరగడం, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించడం, రైతులకు మెరుగైన ఆదాయం అందడం వంటి ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. దత్తాత్రేయ వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, టక్కర్ హనుమంత్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, ముక్కా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)

