అమరావతి సరే.. ప్రత్యేక హోదా మాటేంటి?: బొత్స

కలం, వెబ్ డెస్క్: అమరావతి రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. లోక్‌సభలో, రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందింది. ఇదెలా ఉంటే ఇదే సమయంలో వైసీపీ కొత్తరాగం అందుకున్నది. జగన్ మావిగన్ అంటూ ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చారు. మావిగన్ కు అనుకూలంగా నిత్యం వైసీపీ నేతలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కీలక‌హామీని పక్కనపెట్టారా?

అమరావతి అంశాన్ని మాత్రమే ముందుకు తెస్తూ ప్రత్యేక హోదా వంటి కీలక హామీలను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే అమరావతి లాంటి 10 నగరాలు నిర్మించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ హామీపై కేంద్రం, రాష్ట్రం రెండూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

ప్రత్యేకహోదా ఏమైంది?

“అమరావతి సరే… ప్రత్యేక హోదా ఏమైంది?” అంటూ బొత్స సూటిగా ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాష్ట్రానికి అత్యంత అవసరమైన ప్రత్యేక హోదా అంశం పూర్తిగా పక్కన పడిపోయిందని అన్నారు. ప్రత్యేక హోదా లభించి ఉంటే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వచ్చి ఉండేవని, ఉపాధి అవకాశాలు పెరిగి ఉండేవని పేర్కొన్నారు. రెండేళ్లలో అమరావతిని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారని కూడా ఆయన ప్రశ్నించారు. రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయని విమర్శించారు. అమరావతిని అభివృద్ధి చేయడంలో స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లే పురోగతి కనిపించడం లేదని అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కూడా బొత్స గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. ఈ హామీలను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన బొత్స, ఇది కేవలం రాజకీయ అంశం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక విషయం అని అన్నారు. ఈ అంశంపై అన్ని పార్టీలు కలసి పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. కానీ ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి కృషి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

విభజన హామీలు ఏమయ్యాయి?

అమరావతికి ఉభయ సభల్లో ఆమోదం లభించడంతో అధికార పక్షం దానిని పెద్ద విజయంగా ప్రచారం చేస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై “ప్లాన్-బీ” వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమరావతి కంటే ముఖ్యమైనది ప్రత్యేక హోదా అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే బొత్స వంటి సీనియర్ నేతలు వరుసగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రత్యేక హోదా లభించి ఉంటే అమరావతి లాంటి నగరాలు ఒక్కటి కాదు, పది నగరాలు అభివృద్ధి అయ్యేవని బొత్స వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున వచ్చి ఉండేవని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడేదని అన్నారు. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయిన రాష్ట్రం ఇప్పటికీ నష్టపోతూనే ఉందని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>