కలం, నిర్మల్ : బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై (MLA Alleti) మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బుధవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను తాలు, తరుగు పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. రైతులు, ప్రజల ఆగ్రహం కారణంగానే గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారని పేర్కొన్నారు. అవినీతి గురించి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించిన బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం గన్నీ సంచులు పంపించినప్పటికీ అప్పటి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించలేక రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) ఆధ్వర్యంలో “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అసైన్డ్ భూముల ఆక్రమణలు, భీమన్న గుట్ట ప్రాంతంలో జరిగిన పరిణామాలపై కూడా మాజీమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలం కాకపోయినా భీమన్న గుట్ట ప్రాంతానికి అనుమతులు ఎందుకు ఇచ్చారో వెల్లడించాలని ప్రశ్నించారు. పాక్పట్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులను ప్రస్తుత ప్రభుత్వమే నిలిపివేసిందని, ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. అవినీతి ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించాలని, ఈ అంశంపై గురువారం నిర్మల్ శివాజీ చౌక్లో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు సవాల్ విసిరారు.
Read Also: కరీంనగర్లో మంత్రుల సవాల్.. ‘టెండర్లలో అవినీతి నిరూపిస్తారా?’
Follow Us On: X(Twitter)

