ప్రధాని సభలో రెండు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు: రామ్‌చందర్‌రావు

కలం, వెబ్ డెస్క్: ఈ నెల 10న తెలంగాణకు ప్రధాని మోదీ విచ్చేనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్‌రావు మరోసారి తెలిపారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ (PM Modi Meeting) ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను అంకితం చేయనున్నారని వివరించారు. సుమారు రెండు లక్షల మంది పాల్గొనేలా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎండలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సభా వేదికతోపాటు మొత్తం గ్రౌండ్‌ను కవర్ చేసేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు.

అస్సాం, పుదుచ్చేరి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాలు చారిత్రాత్మకమైనవని రామ్ చందర్ రావు చెప్పారు. ఈ అద్భుతమైన ఎదుగుదల తెలంగాణ ప్రజల్లో, బీజేపీ కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ బహిరంగ సభలో పాల్గొనేందుకు మహిళలు, యువత, మేధావులు, వృత్తి నిపుణులు సహా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ చారిత్రాత్మక బహిరంగ సభను ఘన విజయవంతం చేసేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పదాధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రైలు టికెట్లు కొనుగోలు చేసి సభకు హాజరయ్యేందుకు వస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల రాకపోకలకు అనవసరమైన ఆంక్షలు లేకుండా, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, ప్రజలు సభా ప్రాంగణానికి సులభంగా చేరుకునేలా పోలీసు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై ఘన విజయవంతం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>