కలం, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే (DMK) (ద్రవిడ మన్నేట్ర కజగం) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి కూర్చోలేమని డీఎంకే స్పష్టం చేసింది. తమకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు డీఎంకే లేఖ రాసింది. ‘లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల పక్కన మేం కూర్చోలేం. ఇంతకాలం మేం ఒకే కూటమిగా ఉన్నాం. ఇప్పుడు విడిపోయాం. మా పార్టీ ఎంపీలకు మరో చోట సీటింగ్ సౌకర్యం కల్పించండి.‘ అంటూ లోక్ సభ స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు.
విజయ్కి కాంగ్రెస్ మద్దతు.. డీఎంకే ఆగ్రహం
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే విజయ్ కి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయ్ కి మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల డీఎంకే తీవ్ర ఆగ్రహంగా ఉంది. తమిళనాడు ఎన్నికల్లో తమ మద్దతుతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ్ కి సపోర్ట్ చేయడం ఏమిటని డీఎంకే నేతలు ప్రశ్నించారు. తమ కూటమిలో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని డీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నారు. డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తమతో ఏ మాత్రం సంప్రదించకుండా ఏకపక్షంగా విజయ్కి మద్దతు ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి
ఇండియా కూటమి నుంచి క్రమంగా ప్రాంతీయ పార్టీలు బయటకు వస్తుండటం గమనార్హం. గతంలో ఆప్ కూడా కాంగ్రెస్ పార్టీతో విబేధించి బయటకు వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని.. రాష్ట్రాల్లో పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

