కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందుర్ (Indur) జిల్లా వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కలెక్టర్ ను కోరారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులు పండించిన ధాన్యం ఎప్పటికప్పుడే కల్లాలకు చేరుకుంటున్నప్పటికీ అధికార యంత్రాంగం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల అన్నదాతలు తమ పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అకాల వర్షాల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే దళారులు, ప్రైవేట్ వ్యాపారులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని రైతులను దోచుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కొనుగోలు ప్రక్రియను త్వరగా ప్రారంభించని యెడల, రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

