కలం, వెబ్ డెస్క్: చెపాక్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కేవలం విజయం మాత్రమే కాదు, అవార్డుల వేటలోనూ పంజాబ్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. 11 బంతుల్లోనే 39 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు దక్కాయి.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ & సూపర్ స్ట్రైకర్: 354.5 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య (పంజాబ్).
అత్యధిక ఫోర్లు & సిక్సర్లు: చెన్నై ఓపెనర్ ఆయుష్ మాత్రే (6 ఫోర్లు, 5 సిక్సర్లు).
టాటా ఐపీఎల్ మోస్ట్ డాట్ బాల్స్: 11 డాట్ బాల్స్తో పంజాబ్ బౌలర్ మార్కో జాన్సెన్ ఈ అవార్డు అందుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆయుష్ మెరుపు ఇన్నింగ్స్కు తోడు శివమ్ దూబే 45 పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్ అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు తీసి డెత్ ఓవర్లలో చెన్నైని కొంతవరకు నిలువరించారు. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో విజయం వైపు సాగింది. చివర్లో మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
పంజాబ్ రికార్డ్లు..
టీ20 క్రికెట్లో 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం పంజాబ్కు ఇది 9వ సారి, ఇది ప్రపంచ రికార్డు. చెపాక్లో చెన్నైపై పంజాబ్కు ఇది వరుసగా నాలుగో విజయం. మరోవైపు సొంత మైదానంలో చెన్నైకి ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం. ఈ విజయంతో పంజాబ్ తమ బ్యాటింగ్ బలాన్ని చాటుకోగా, చెన్నై తమ బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

