కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే వర్షాకాలం నేపథ్యంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అన్ని రక్షణ శాఖలు పరస్పర సమన్వయంతో పని చేస్తూ అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖల అధికారులతో ఆయన ఒక ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందస్తుగానే గుర్తించాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలను ముంపు ప్రాంతాలకు సమీపంలోనే మోహరించాలని ఆదేశించారు. వరదలు, ఇతర విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడటమే మన ప్రధాన లక్ష్యమని, అందుకోసం అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిరంతరం విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రక్షణ చర్యలకు అవసరమైన బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్ రోడ్లపై కూలిన చెట్లను వేగంగా తొలగించడానికి కావలసిన కట్టర్లను, ఇతర అత్యవసర సామాగ్రిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ముందే హెచ్చరిస్తూ తగిన జాగ్రత్తలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఫైర్ అధికారి క్రాంతి కుమార్, టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్, తదితరులు పాల్గొన్నారు.

