కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ప్రశంసలు కురిపించారు. శనివారం పాల్వంచలోని పెద్దమ్మ గుడి ఆవరణలో గల ఫంక్షన్ హాల్లో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రశంసా పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Ankit) మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం సవాలుతో కూడుకున్న పని అయినప్పటికీ, జిల్లా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని అన్నారు. చర్ల, గుండాల వంటి దూర ప్రాంతాల్లో టెలీమెడిసిన్, డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ వైద్య సేవల ద్వారా ప్రజలకు సమయానికి చికిత్స అందించడం సాధ్యమవుతోందని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకంతో మారుమూల గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
ఆశా కార్యకర్తల నుండి ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్యులు, జిల్లా స్థాయి అధికారుల వరకు అందరి సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య శాఖ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి, భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు దేశ స్థాయిలో కూడా ఉత్తమ స్థానంలో నిలవాలని ఆయన సూచించారు. ప్రతి పల్లెకు ఆరోగ్య సేవలు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రవిబాబు, తహసిల్దార్ దారా ప్రసాద్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, నర్సులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: ఐలాపూర్లో హైడ్రా భారీఆపరేషన్ ఎలా సాధ్యమైంది?
Follow Us On: X(Twitter)

