కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య క్షేత్రంలో పునర్వసు నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామి వారి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే వైదిక కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ సాగిన ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులంతా భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
”శ్రీరామ జయ రామ జయ జయ రామ” అంటూ భక్తులు చేసిన రామనామ స్మరణతో భద్రాద్రి ఆలయ వీధులన్నీ భక్తి పారవశ్యంతో మార్మోగాయి. ఈ విశేష పూజలను తిలకించేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి పోటెత్తారు. స్వామి వారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉండి, సీతారామ లక్ష్మణులను దర్శించుకొని భక్తులు తరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ
Follow Us On: X(Twitter)

