కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని మోదీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని తన నివాసంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై భావోద్వేగంతో స్పందించారు. ‘ప్రజా జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తుంటాం. కానీ, తల్లిపై ఎవరైనా దాడి చేస్తే ఆ బాధ చాలా భిన్నంగా ఉంటుంది. గత నెల నాకు ఒక విషయాన్ని బాగా అర్థమయ్యేలా చేసింది. రాజకీయ పోరాటాలు, ఒత్తిళ్లు, ద్వేషాలు ఎంత పెరిగినా, చివరికి మన అమ్మ క్షేమంగా, ఆరోగ్యంగా మనతో ఉండటం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదని తెలుసుకున్నా. అమ్మకు స్ట్రోక్ రావడం నన్ను తీవ్రంగా కలచివేసింది’ అని పేర్కొన్నారు.
తల్లి విలువ మాటల్లో చెప్పలేనిది..
అమ్మ పేరుతో మొక్క నాటుతుంటే ఆమెతో తనకున్న అనుబంధం ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది కేవలం ఒక మొక్క కాదని, తనకు తల్లిపై ప్రేమ, కృతజ్ఞత, ధైర్యానికి ప్రతీక అన్నారు. తల్లి విలువను మాటల్లో చెప్పలేనని.. ఈ మొక్క కూడా ఆమె ప్రేమ, త్యాగం, ధైర్యం లాగే బలంగా, అందంగా, చిరస్థాయిగా ఎదగాలని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. “ఏక్ పేడ్ మా కే నామ్” వెనుక ప్రధాని మోదీ ఆలోచన ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకుతుందన్నారు. చివరగా, తల్లి ఇచ్చే రక్షణకు సాటి లేదు. తల్లి ప్రేమకు సమానం మరెవ్వరూ లేరంటూ ముగించారు.

