కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్ పూర్ మండల పరిధిలోని గండిగూడెం చెరువులోకి కాలుష్య జలాలు చేరకుండా ప్రత్యేక కాలువ నిర్మించనున్నట్లు పటాన్ చెరువు ఎమ్మెల్యే (Patancheru MLA) గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) తెలిపారు. గండిగూడెం చెరువు అలుగు మట్టాన్ని పూర్వస్థితికి తీసుకుని రావడంతో పాటు వివిధ పరిశ్రమల నుండి కాలుష్య జలాలు చెరువులోకి చేరకుండా చెరువు సమీపం నుండి ప్రత్యేక కాలువ నిర్మించి వాటిని బయటకు పంపించనున్నట్లు తెలిపారు.
గతంలో కలుషిత జలాలు చెరువులోకి చేరడంతో పెద్దఎత్తున చేపలు చనిపోయి మత్స్యకారులు నష్టపోయారని ఎమ్మెల్యే అన్నారు. పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు కాలుష్య జలాలు వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గండిగూడెం చెరువులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు.

