ఎన్నికల్లో పోటీకి దూరం.. అన్నామలై క్లారిటీ !

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బీజేపీ కీలక నేత కె. అన్నామలై (Annamalai) స్పష్టం చేశారు. కేరళ పర్యటన ముగించుకుని చెన్నై చేరుకున్న ఆయన, శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ హైకమాండ్‌కు పంపిన జాబితాలో తన పేరు ఎప్పుడూ లేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తాను అభ్యర్థిగా కాకుండా, కేవలం ప్రచారకర్తగా మాత్రమే బాధ్యతలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే అవకాశం తనకు ఉందని, అయితే పార్టీ అప్పగించిన ప్రచార బాధ్యతలను నెరవేర్చడమే తన ప్రస్తుత లక్ష్యమని అన్నామలై (Annamalai) పేర్కొన్నారు. ఏప్రిల్ 7 వరకు పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తానని, ఆ తర్వాత ఏప్రిల్ 23 వరకు తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి బీజేపీ, ఎన్డీయే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. టికెట్ నిరాకరించడం వల్ల తాను పోటీకి దూరంగా లేనని, స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముందే పార్టీ ముఖ్య నేతలైన పియూష్ గోయల్, బీఎల్ సంతోష్ వంటి వారికి లిఖితపూర్వకంగా తెలియజేశానని, తన నిర్ణయాన్ని గౌరవించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

తమిళనాడులో బీజేపీ తరపున ఇప్పటికే 27 మంది అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇందులో తమిళిసై సౌందరరాజన్, వానతి శ్రీనివాసన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ వంటి సీనియర్ నేతల పేర్లు ఉన్నప్పటికీ అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య స్పందిస్తూ, అన్నామలై (Annamalai) పార్టీలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని కొనియాడారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం వల్ల అభ్యర్థుల విజయానికి గట్టి బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 210 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుందని, ఆ దిశగా తామంతా భుజం భుజం కలిపి పనిచేస్తామని అన్నామలై పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>