కలం, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయ (Basara Temple) అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారు. శనివారం ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్పై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని సూచించారు. ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

