కలం, వెబ్ డెస్క్ : రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి(Amaravati)ని ప్రపంచస్థాయి ‘ఫ్యూచర్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వారం, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రూ.57,821 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని, వీటిని నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిని కేవలం కాంక్రీట్ కట్టడంగా కాకుండా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని వెల్లడించారు.
రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని, ప్రతి ఇటుకలోనూ నాణ్యత ఉట్టిపడాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.గతంలో నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని, క్షేత్రస్థాయిలో మార్పు స్పష్టంగా కనిపించాలన్నారు. పేపర్ మీద ఉన్న ఫ్యూచర్ సిటీ విజన్ను నేల మీద సాకారం చేసి చూపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని, నిర్ణీత సమయంలోగా ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి కావాలని హుకుం జారీ చేశారు.

