కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అమరావతి (Amaravati) కేంద్రంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ అమరావతికి చట్టబద్ధత కల్పించిన వేళ ప్రతిపక్ష వైఎస్సార్సీపి మావిగన్ అనే ప్రతిపాదనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై ప్రతిపక్ష వైఎస్సార్సీపి చేస్తున్న విమర్శలకు మంత్రి నారాయణ (Minister Narayana) కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై వైసీపీ రోజుకోలా మాట్లాడుతుందన్నారు. 3 ముక్కలాట ఆడి రాష్ట్ర భవిష్యత్ తో అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఇప్పుడు మావిగన్ (MAVIGUN) అంటూ కొత్త పదాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. అయితే రాజధాని అమరావతికి ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము తీసుకోమన్న మంత్రి.. అమరావతి పూర్తి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు.
భవిష్యత్ లో భూముల విలువ పెరుగుదల దృష్యా అమరావతికి 5వేల ప్రభుత్వ ఎకరాలు రిజర్వ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆ భూముల విలువతో తీసుకున్న రుణాలు చెల్లించే విధంగా ప్లాన్ చేశామని వివరించారు. నిజానికి 2019 తర్వాత రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే .. వ్యయం కూడా చాలా తగ్గేదని చెప్పారు. ప్రస్తుతం జీఎస్టీ 12 నుంచి 18 శాతం పెరిగిందని తెలిపారు. అటు రాజధాని ఖర్చులపై తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోందని.. స్క్వేర్ ఫీట్ ధరలను వక్రీకరిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో స్క్వేర్ ఫీట్కు రూ.12 వేలు, ఢిల్లీ సెంట్రల్ విస్టాలో రూ.16 వేలు ఖర్చు అయ్యిందన్న మంత్రి.. వాటితో పోల్చితే అమరావతి ఖర్చులు సమంజసమేనన్నారు.
అమరావతిలో పనులు వేగంగా మూడు షిఫ్ట్ లో జరుగుతున్నాయని మంత్రి నారాయణ (Minister Narayana) చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారుల భవనాలు మే నెలాఖరుకు పూర్తవుతాయని .. మే నెలాఖరు నాటికి 90 శాతం ప్రభుత్వ భవనాలు సిద్ధమవుతాయని తెలిపారు. ట్రంక్ రోడ్లు, లే అవుట్ పనులు 2027 నాటికి పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్లు సహా ప్రధాన నిర్మాణాలు 2028 ఆగస్టు నాటికి సిద్దం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, 70, 790 ప్లాట్లను రైతులకు కేటాయించాల్సి ఉండగా.. 62, 942 ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని మంత్రి చెప్పారు. 650 మంది రైతులకు మాత్రమే 489 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా.. న్యాయపరమైన అంశాలతోనే ఆలస్యం అవుతుందని చెప్పారు.
Read Also: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారుపై పడ్డ సిమెంట్ ట్యాంకర్
Follow Us On : WhatsApp

