కలం, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు ఢిల్లీ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, సంతకం , వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధం విధించాలని అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. అల్లు అర్జున్ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ పేరు, ఫొటో, వాయిస్తో పాటు ఇతర వ్యక్తిగత గుర్తింపులను ముందస్తు అనుమతి లేకుండా వ్యాపార అవసరాలకు వాడుకోవడంపై కోర్టు మధ్యంతర నిషేధం విధించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీల ద్వారా అల్లు అర్జున్ పేరు, ఫోటోలు, గొంతు, హావభావాలని వాణిజ్యపరంగా కానీ, ఇతర ఏ రూపంలో కానీ వినియోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు అభ్యంతరకరంగా ఉన్న లింకులు, వెబ్సైట్లను 72 గంటల్లోగా తొలగించాలని సంబంధిత సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణను జులై 14, సెప్టెంబర్ 24 తేదీలకు వాయిదా వేసింది. కాగా, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల విషయంలో అల్లు అర్జున్ కంటే ముందు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ , చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి వారు ఇలానే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.

