కలం, నిర్మల్ : పన్ను తగ్గించేందుకు వ్యాపారి నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటూ నిర్మల్ (Nirmal) జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు చెందిన డీసీటీఓ కే. గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ ఏసీబీ అధికారులకు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ వ్యాపారి శ్రీ లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ కు సంబంధించిన 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల రికార్డుల ఆడిట్ లో అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు తొలుత లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
చివరకు రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి ఫిర్యాదు మేరకు అధికారులు పక్కా ప్రణాళికతో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో వల పన్నారు. ఈ క్రమంలో డీసీటీఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ కలిసి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ధైర్యంగా ఏసీబీ(ACB)కి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ జి.మధు సూచించారు. ఫిర్యాదుల కోసం 9154388963, టోల్ ఫ్రీ నంబర్ 1064తో పాటు ఏసీబీ హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్ 9440446106ను సంప్రదించవచ్చని తెలిపారు.
Also Read : ఏసీబీ దాడులు.. లెక్క చేయని అధికారులు
Follow Us On : WhatsApp

