కలం, వెబ్ డెస్క్ : పాలమూరు ( మహబూబ్నగర్) జిల్లా పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలోని పలు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షుణంగా సీఎం, మంత్రుల బృందం పరిశీలించింది. ముఖ్యంగా కోయిల్ సాగర్, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, జూరాల ప్రాజెక్టు (Jurala Project)డ్యామ్ ను పరిశీలించారు. సీఎం తన సొంత నియోజకవర్గం పరిధిలోని కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైన కాట్రేవుపల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని స్వయంగా వీక్షించారు.
అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవన్న సీఎం.. భూసేకరణకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుని భూసేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని… భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
Read Also: U-18 ఆసియా కప్ సెమీస్లోకి భారత జట్లు
Follow Us On: X(Twitter)

