కలం, వరంగల్ బ్యూరో : జనగణన దేశ అభివృద్ధికి పునాది వంటిదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది అత్యంత కీలకమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ (Collector Chahat Bajpai) అన్నారు. గురువారం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు నిర్వహించిన సర్వేలో కలెక్టర్ తన కుటుంబ వివరాలను నమోదు చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుందని తెలిపారు. అందువల్ల ప్రజలు ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఎన్యూమరేటర్లకు పూర్తి, ఖచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ జాతీయ కార్యక్రమంలో బాధ్యతగా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు.

