కలం, మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజాప్రచారం, పాపులారిటీ కోసమే ఆరాటపడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) విమర్శించారు. గురువారం జోగులాంబ గద్వాల పట్టణంలోని ఎస్వి ఈవెంట్ హాల్లో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె అన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంతానికి ఏమి చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రోడ్డు మార్గంలో వస్తే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సీఎం హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని ఆమె విమర్శించారు. నడిగడ్డ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు.
రేలంపాడు ప్రాజెక్టులో నీటి నిల్వలు సరిగా లేవని, మరమ్మతులు కూడా జరగలేదని తెలిపారు. గూడెం దొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుతామని చెప్పి మాట తప్పారని, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉందని విమర్శించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు కింద కాలువలు, రిజర్వాయర్ల పనులు నిలిచిపోయాయని ఆమె అన్నారు. గద్వాల ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్లో, ప్రస్తుతం కాంగ్రెస్లో ఉండి అవినీతికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, ప్రజలకు చేసింది ఏమీ లేదని డీకే అరుణ (DK Aruna) విమర్శించారు.
Read Also: హైటెక్స్లో ‘పోచంపల్లి ఇక్కత్’ వస్త్ర ప్రదర్శన: కలెక్టర్ అనురాగ్ జయంతి
Follow Us On: X(Twitter)

