కలం, వెబ్ డెస్క్ : పాలమూరు ( మహబూబ్నగర్) జిల్లా పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృతంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలోని పలు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను క్షుణంగా సీఎం, మంత్రుల బృందం పరిశీలించింది. ముఖ్యంగా కోయిల్ సాగర్, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, జూరాల ప్రాజెక్టు డ్యామ్ ను పరిశీలించారు. సీఎం తన సొంత నియోజకవర్గం పరిధిలోని కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైన కాట్రేవుపల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని స్వయంగా వీక్షించారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడిన సీఎం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టుల పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

