కలం, నిర్మల్ : మహిళలు, చిన్నారులకు భద్రత, రక్షణతో పాటు న్యాయ సహాయం, మానసిక పరామర్శ, పునరావాస సేవలను ఒకే వేదికపై అందించేందుకు నిర్మల్(Nirmal) రూరల్ మండలం ఎల్లపెల్లి (Yellapalli) గ్రామ శివారులో నూతన భరోసా కేంద్రాన్ని(New Bharosa Centre) ఏర్పాటు చేశారు. ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఈ భరోసా కేంద్రాన్ని మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు జిల్లా ఎస్పీ జానకి షర్మిల భరోసా కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, చిన్నారులకు పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సలహాలు, మానసిక కౌన్సిలింగ్, పునరావాస సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని తెలిపారు. భరోసా కేంద్రం నిర్మాణానికి సహకరించిన ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రునాల్ పటేల్కు జిల్లా పోలీసు శాఖ తరఫున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సంస్థ ప్రతినిధులు, న్యాయాధికారులు, పోలీసు అధికారులు, భరోసా కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

