కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్ ( FIFA World Cup) 2026 ప్రీక్వార్టర్లో అమెరికాను 4-1తో చిత్తు చేసిన తర్వాత బెల్జియం గోల్కీపర్ థిబౌట్ కుర్టువా (Thibaut Courtois) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా అమెరికా చూపిన అగౌరవానికి తమ జట్టు మైదానంలోనే సమాధానం చెప్పిందని ఆయన పేర్కొన్నాడు. ఈ మ్యాచ్కు ముందు అమెరికా ఫార్వర్డ్ ఫొలారిన్ బాలోగన్ ఆడటంపై పెద్ద వివాదం నెలకొంది. బోస్నియా అండ్ హెర్జెగోవినాపై జరిగిన మ్యాచ్లో అతడు రెడ్ కార్డు పొందాడు.
అయితే ఆ సస్పెన్షన్ను ఏడాది పాటు వాయిదా వేయడంతో అతడికి బెల్జియంతో మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఈ నిర్ణయాన్ని బెల్జియం ఫుట్బాల్ సంఘం ఫిఫా వద్ద సవాలు చేసింది. కానీ ఫిఫా ఆ అప్పీల్ను తిరస్కరించింది. దీంతో బాలోగన్ మ్యాచ్లో ఆడాడు. అయినా బెల్జియం అద్భుత ప్రదర్శన చేసింది. చార్లెస్ డి కెటెలారే రెండు గోల్స్ చేయగా, హాన్స్ వనాకెన్, రొమేలు లుకాకు చెరో గోల్ సాధించారు. అమెరికా తరఫున మాలిక్ టిల్మన్ ఒక్క గోల్ మాత్రమే చేశాడు. బెల్జియం 4-1తో ఘన విజయం అందుకుంది.
మ్యాచ్ అనంతరం కుర్టువా మాట్లాడుతూ, అమెరికాపై గెలుస్తామనే నమ్మకం తమకు ముందే ఉందని తెలిపాడు. సెనెగల్తో పోలిస్తే అమెరికా అంత బలమైన జట్టు కాదని కూడా పేర్కొన్నాడు. మరోవైపు బెల్జియం ఆటగాడు నికోలస్ రాస్కిన్ కూడా స్పందించాడు. బాలోగన్కు మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వడం న్యాయంగా అనిపించలేదని తెలిపాడు. చివరికి న్యాయమే గెలిచిందనే భావన తమకు కలిగిందని చెప్పాడు. ఈ విజయంతో బెల్జియం క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. జూలై 10న జరిగే తదుపరి మ్యాచ్లో స్పెయిన్తో తలపడనుంది.

