కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని పిస్తా హౌస్ రెస్టారెంట్లో భోజనం చేసిన ఒక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఇన్ఛార్జి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ.శరత్ నేతృత్వంలోని బృందం మంగళవారం సదరు రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించింది. వంటశాల నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.
నమూనాలు సేకరించి..
అనంతరం రెస్టారెంట్ నుంచి రెండు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ.. ల్యాబ్ నివేదికలు అందిన వెంటనే ఫలితాల ఆధారంగా ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిరంతరం నిఘా..
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని, జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లపై నిరంతరం నిఘా ఉంటుందని ఇన్ఛార్జి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ.శరత్ స్పష్టం చేశారు. వ్యాపార నిర్వాహకులు తప్పనిసరిగా నాణ్యమైన ముడిపదార్థాలనే వాడాలని సూచించారు.
వినియోగదారులు కూడా ఆహార నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నాసిరకం లేదా కలుషిత ఆహారాన్ని గుర్తిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

