కలం, జోగులంబ గద్వాల : కేటిదొడ్డి మండలం నందిన్నె (Nandinne) గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, ప్రత్యేక హోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అభిషేకాలతో స్వామివారికి విశేష పూజలు చేశారు.
లగ్న ముహూర్తాన భక్తుల జయజయధ్వానాల మధ్య ధ్వజస్తంభాన్ని, బొడ్రాయిని ప్రతిష్టించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి నందిన్నె గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తజనసందోహంతో, శ్రీఅంజన్న నామస్మరణతో మారుమోగాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు.
మహోత్సవాలలో పాల్గొన్న ప్రముఖులు
నందిన్నె గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవ పూజా కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నందిన్నె ప్రకాష్ రావు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ బాసు హన్మంతు నాయుడు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

